హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సిబ్బంది వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నాగర్కర్నూల్ బస్స్టాండ్లో బస్సు డ్రైవర్ శాంతయ్య పాట కట్టి ప్రయాణికులను అలరిస్తున్నారు. బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులను పెదకొత్తపల్లి మండలంలోని బంగారు మైసమ్మ గుడికి వెళ్లి వద్దాం అంటూ తన పాటద్వారా కోరుతున్న తీరు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
శాంతయ్య మైక్ పట్టుకుని ‘బాధలు తీర్చే బంగారు మైసమ్మ దగ్గరకు.. భద్రంగా బస్సులో పోయి వద్దాం.. అక్కారండి, చెల్లే రండి.. అమ్మలగన్న అమ్మ బంగారు మైసమ్మ దగ్గరికి అమ్మలాంటి ఆర్టీసీ బస్సులో పోయివద్దాం’ అంటూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఎక్కేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించడంతోపాటు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఏడు రోజుల్లోనే ఆరువేల మంది చూశారు. 79 మంది రీట్వీట్ చేశారు.
Promoting #PublicTransport By Sri Shanthaiah Driver, #Nagarkurnool depot #TSRTC #Hyderabad #IchooseTSRTC @puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @VChelamela @SpNagarkurnool @TV9Telugu @sakshinews @V6News @way2_news @rpbreakingnews @AsianetNewsTL @ANI @PIBHyderabad @IPRTelangana pic.twitter.com/H6RO0NAmKy
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 15, 2021