సూర్యాపేట, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట మిద్దెపంటల పేటగా మారింది. మున్సిపాలిటీలోని ఇండ్లపై పందిరితోటల పంట పండుతున్నది. క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి నాటిని బీజం పేటంతా విస్తరిస్తున్నది. పట్టణంలో 1,050 ఇండ్లపై సేంద్రియపద్ధతిలో కూరగాయలు, పూలు, పండ్ల్లు సాగు చేస్తున్నారు. వీటిద్వారా ప్రతిరోజూ 1,500 కిలోలకుపైగా వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. రూ.10 వేల విలువ చేసే రూఫ్గారెన్లను రూ.1,500లకే అందిస్తూ మిద్దెపంటలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ఇతర జిల్లాల్లోనూ చేపట్టడంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల అధికారులు సూర్యాపేటలోని ఈ విధానాన్ని తెలుసుకుని వెళ్తున్నారని స్థానిక మున్సిపల్ అధికారులు తెలిపారు. మంత్రి జగదీశ్రెడ్డి తన క్యాంపు కార్యాలయంపై ముందుగా మిద్దెపంటను ప్రారంభించారు. ఈ విధానం బాగుండటంతో పట్టణవాసులకు అలవాటు చేస్తే బాగుంటుందనే ఆలోచించారు. ఈ మేరకు జిల్లా మినరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించేలాచేసి టెర్రస్ గారెన్లు విరివిగా ఏర్పాటయ్యేలా చూశారు.
రోజుకు 1500కిలోలపైగా కూరగాయలు
మున్సిపాలిటీలోని 1,050 ఇండ్ల్లపై ప్రతిరోజూ 1,500 కిలోలకుపైగా కూరగాయలు పండుతున్నాయి. సొర, బీర, కాకర, దోస, బెండ, టమాట, పచ్చిమిర్చి, మునగ, వంకాయ, క్యాబేజీ, చామగడ్డ, చిక్కుడు వంటి కూరగాయలు.. పాలకూర, బచ్చలి, చుక్క, మెంతి, పూదీన, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్నిండ్లపై జామ, దానిమ్మ, సపోట, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్ఫ్రూట్ పండ్లతోపాటు అనేక రకాల పూల చెట్లు కూడా పెంచుతున్నారు. ఒక్కోఇంటినుంచి అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు కలిపి సరాసరి కిలో నుంచి మూడు కిలోల వరకు వస్తుండగా.. 1,050 ఇండ్ల్లపై 1500 కిలోలకుపైగా పండుతున్నాయి. ఉదయం, సాయంత్రం టెర్రస్ గార్డెన్లో పని చేస్తుండడంతో వ్యాయామ కూడా అవుతున్నది. సేంద్రియ కూరగాయలు తాము తింటూ.. బంధువులు, స్నేహితులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పలువురు సంతోషంగా చెప్తున్నారు.
స్వచ్ఛమైన కూరగాయలు
పట్టణంలోని మిద్దెలపై పండే పంటలు స్వచ్ఛమైన కూరగాయలకు కేరాఫ్గా మారింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో ఇంటిపంట పండించుకొనేందుకు 90 శాతం నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. మంత్రి సంకల్పాన్ని ప్రజలు అర్థం చేసుకొని అవకాశం ఉన్న ప్రతిఒక్కరూ ఇంటిపంట వేసుకోవాలి. ఇంట్లో పండే కూరగాయలు, ఆకుకూరలు ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
-పెరుమాళ్ల అన్నపూర్ణ, చైర్పర్సన్,సూర్యాపేట మున్సిపాలిటీ
10వేల సామగ్రి 1500కే
టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు రూ.1,500 డీడీ తీస్తే రూ.10 వేల విలువ చేసే విత్తనాలు, కంపోస్టు ఎరువు, వేపనూనె, ఇంట్లోనే కంపోస్టు తయారీకి బిన్లు, తొట్లు, మట్టిని కూడా మున్సిపాలిటీవారే అందిస్తున్నారు. వాటన్నింటినీ ఇంటికి చేర్చి తొట్లు అమర్చి, మట్టిపోసి, ఎరువులు చల్లి, విత్తనాలు వేసి, మొక్కలు నాటి వెళ్తున్నారు. ఈ ఏడాది రూ.1.22 కోట్ల జిల్లా మినరల్ ఫండ్ (డీఎంహెచ్)తో 1,500 ఇండ్లపై రూఫ్గార్డెన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 1,050 ఇండ్లపై పూర్తిచేశారు.
ఆర్గానిక్ కూరగాయలు తినాలని
మార్కెట్లో పండ్లు, కూరగాయలు, పూలు రసాయనాలు, పురుగు మందులతో పండించినవే. దీంతో మాఇంటి మిద్దెపై మున్సిపాలిటీవారు ఇచ్చిన మిద్దెపంట కిట్తో సాగు మొదలుపెట్టాం. పలు కాయగూరలు, పండ్లు, పూల మొక్కలను తెచ్చిపెట్టాం. ఇంట్లోని ఏ వ్యర్థాలనూ బయట పడేయకుండా ఎరువుగా మార్చి మొక్కలకు అందిస్తున్నాం. అవి ఏపుగా పెరిగి మా ఇంటికి సరిపడా కూరగాయలు, పూలు, పండ్లు అందిస్తున్నాయి. దీంతో ఆర్గానిక్ కూరగాయలు తినాలనే కోరిక నేరవేరింది.
-వందనపు శ్రీదేవి, సూర్యాపేట
ఇతర పట్టణాల్లో ప్రయత్నిస్తున్నరు
సూర్యాపేటలో అమలవుతున్న ఇంటిపంట విధానాన్ని సిద్దిపేట, మహబూబ్నగర్ తదితర మున్సిపాలిటీల్లో అమలుచేసేందుకు అధికారులు సంప్రదిస్తున్నారు. సూర్యాపేటలో ప్రస్తుతం 1,050 ఇండ్లపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు పండుతున్నాయి. కేవలం పదిహేను వందల రూపాయలు వెచ్చించి దరఖాస్తు చేస్తే రూ.10వేల విలువైన ఇంటిపంట సామగ్రిని అందిస్తాం. -రామానుజులరెడ్డి, మున్పిపల్ కమిషనర్, సూర్యాపేట