పార్టీ సభలు, సమావేశాలు, మీడియాలో తెలంగాణ అమరుల త్యాగాలపై పదే పదే మాట్లాడే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వారిని యాది చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, మేధావులు, విద్యావంతులు ఎవరైనా వరంగల్కి వచ్చినపుడు తొలుత హనుమకొండ అదాలత్లోని తెలంగాణ అమరుల స్తూపానికి దండేసి వారిని స్మరించు కోవడం అనవాయితీ. అంతే కాకుండా ధిక్కార స్వరం ప్రజా కవి కాళోజీ, తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తుంటారు.
కానీ, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఉద్యమాల గడ్డపై కాలుమోపి కనీసం అమర వీరులకు దండం పెట్టుకోకపోవడం, కాళోజీ, జయశంకర్ సార్లను మరిచిపోవడంపై అన్ని రాజకీయపార్టీ నేతలు, విశ్లేషకులు, మేధావులు, విద్యార్థులు, వరంగల్ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. పాదయాత్ర పేరుతో సోమవారం వరంగల్కు వచ్చిన రేవంత్రెడ్డి సాయంత్రం హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ బంగ్లా నుంచి పాదయాత్ర చేపట్టారు. అక్కడ ఉన్న తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద ఆగి అడ్వకేట్లతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ తెలంగాణ అమరుల స్తూపాన్ని పట్టించుకోలేదు. అదాలత్ కాళోజీ విగ్రహం వద్ద కూడా ఇదే పరిస్థితి. జిల్లా పార్టీ నాయకుడు బట్టి శ్రీనివాస్ కాళోజీ విగ్రహానికి దండ వేయడానికి పూలదండతో వేచి ఉన్నా, కానీ అదేమీ పట్టించుకోకుండా ముందుకు సాగారు.
ఇక బాలసముద్రం ఏకశిల పార్కులో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూల వేయకపోవడం సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. పార్టీ వేదికలపై ప్రజా కవి కళోజీ, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్, తెలంగాణ అమరుల త్యాగాలపై ప్రతిరోజు మాట్లాడే రేవంత్రెడ్డి వారి విగ్రహాలకు దండ కూడా వేయకపోవడంపై ఓరుగల్లు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.