రాష్ట్రంలో కరువు ఉన్నది. రిజర్వాయర్లన్నీ అడుగంటుతున్నాయి. నీళ్ల కోసం కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకొని సాగునీళ్లు అడగొద్దు. అందరం కలిసికట్టుగా కరువును ఎదుర్కొందాం.
– సీఎం రేవంత్రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కరువు ఉన్నదని, సాగునీరు అడగొద్దని సీఎం రేవంత్రెడ్డి రైతులను కోరారు. ఎండాకాలంలో తాగు నీటి సమస్యలు రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. బుధవారం ఆయన ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని వెల్లడించారు. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలని కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకొని, నీళ్లు అడగవద్దని విజ్ఞప్తి చేశారు. ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని, కలిసికట్టుగా కరువును ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం 110 సెంటర్లలో (రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం) ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ప్రతి సీజన్లో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రైతునేస్తం ఉపయోగపడుతుందని వివరించారు. రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
వరి, పత్తి, మిర్చికే పరిమితం కావొద్దు
రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నదని, కేవ లం వరి, పత్తి, మిర్చి పంటలకే పరిమితం కావొద్దని రైతులకు సీఎం సూచించారు. ఇతర పంటలు సాగు చేయాలని, పంటమార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తకువ నీళ్లు, తకువ పెట్టుబడితో ఎకువ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. పంటకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నదని వెల్లడించారు. రైతు భరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మారెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోళ్లను చేపడుతుందని తెలిపారు. వానకాలం నుంచి అమలు చేయబోయే పంటలబీమా పథకంతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం: తుమ్మల
రైతునేస్తం ప్రారంభం సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయిలోని రైతులతో ఆన్లైన్లో మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మారెట్లలో అధిక ధరను పొందేందుకు అవకాశాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకొనేందుకు పంటల బీమా ప్రీమియంలోని రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లించి, అమలుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.