హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేతలు టీ నిరంజన్, ఘంటా సత్యనారాయణరెడ్డికి శనివారం షోకాజ్ నోటీసులు జారీచేయడం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నది. పార్టీలో ఇంటిదొంగలున్నారని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీకావడంతో కొంతమంది సీనియర్లు భగ్గుమంటున్నారు. మొదటినుంచి పార్టీలో ఉన్నవారిని సాగనంపే కుట్రలకు పాల్పడుతున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలపై రెండ్రోజుల కిందట రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్కు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో సీనియర్లను టార్గెట్ చేస్తూ షోకాజు నోటీసులు జారీ చేయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇప్పటికే రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై ఫిర్యాదుచేసేందుకు అధిష్ఠానం వద్ద నేతలు క్యూ కట్టిన నేపథ్యంలో నోటీసుల వ్యవహారం మున్ముందు పెద్ద దుమారానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.