కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 3 : భూములను దోచుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. దాదాపు 115 ఏండ్లుగా ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు లేని భూములను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దోచుకోవాలనే ఉద్దేశంతోనే సదరు భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.
సర్కార్ తీరుతో పేదలు అరిగోస పడుతున్నారని ఆవేదన చెందారు. ఆపద, అత్యవసర సమయాల్లో, వివాహాది శుభకార్యాల కోసం భూములు అమ్ముకునే అవకాశం లేక నరకం చూస్తున్నారని అన్నారు. పట్టా భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఏదో చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు వ్యతిరేకిగా మారిందని దుయ్యబట్టారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.