(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఏనుగుల సంతతి పెరుగుదలతో ఆఫిక్రా దేశం బోట్స్వానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆహారం దొరక్క ఊళ్లమీద పడే మదగజాల సంఖ్య పెరిగిపోవడం సర్కారుకు కష్టంగా మారింది. ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తున్నదని ప్రభుత్వానికి మొర పెట్టుకొంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో ‘ట్రోఫీ హంటింగ్’పై (ప్రభుత్వానికి డబ్బు చెల్లించి ప్రత్యేక అనుమతితో జంతువులను వేటాడటం) గతంలో విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. తద్వారా ఏనుగుల సంఖ్యకు చెక్ పెట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని భావించింది. అయితే, బోట్స్వానా నిర్ణయాన్ని జర్మనీ వ్యతిరేకించింది. దీంతో తమ నిర్ణయాన్ని వ్యతిరేకించిన జర్మనీకి 20 వేల ఏనుగులను బహుమతిగా పంపిస్తామని బోట్స్వానా స్వీట్వార్నింగ్ ఇచ్చింది. గతంలోనూ ఈ తరహా హెచ్చరికలనే బ్రిటన్కు కూడా చేసింది.