చిగురుమామిడి, జూలై 29 : అతివేగంతో ఓ కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో రిటైర్డ్ ఎస్సై పాపయ్యనాయక్ దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామ శివారులో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లోని పుల్నాయక్తండాకు చెందిన పాపయ్యనాయక్ (60) గురువారం కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు కారులో వెళ్తున్నారు. చిన్నముల్కనూర్ శివారుకు చేరుకోగానే అదుపుతప్పి కారు బావిలో పడిపోయింది. చిగురుమామిడి ఎస్సై మధుకర్రెడ్డి ఘటనాస్థలికి వెళ్లి రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్రెడ్డికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కారుతోపాటు పాపయ్య మృతదేహాన్ని వెలికితీశారు. పాపయ్యకు భార్య భారతి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
షాక్ తిన్న సోదరుడు..
బావిలో కారు పడిపోవడంతో పోలీస్, ఫైరింగ్ సిబ్బంది మధ్యాహ్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విధుల్లో భాగంగా మానకొండూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భూదయ్యనాయక్ కూడా కారును వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కారును క్రేన్తో వెలికి తీయగా, ఆ కారు నెంబర్ చూసి అనుమానించాడు. కారును బయటికి తీసిన తర్వాత డోర్లు తెరిచి చూడగా అందులో ఉన్న సొంత అన్న పాపయ్య నాయక్ను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మృతదేహంపై పడి బోరుమన్నాడు. బావిలో పడింది తన అన్న అని ఏమాత్రం ఊహించలేదని, ఘోరం జరిగిపోయిందని కన్నీరుమున్నీరుగా రోదించాడు.