హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు అతి సమీపంలోని పురాతన అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయి. దశలవారీగా చేపడుతున్న ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం గాలిగోపురం నిర్మాణ పనులు పురాతన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా చేపడుతున్నారు. ఆలయ పనులు అత్యంత పురాతన పద్ధతుల్లో కొనసాగుతున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ చెప్పారు. సామాన్య శకం 7-12 శతాబ్దం మధ్యకాలంలో కల్యాణి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 80 అడుగుల ఎత్తున్న గాలిగోపురాన్ని సున్నపురాయి ప్లాస్టర్, కాల్చిన ఇటుకలు, గార కలయికతో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. బళ్లారి నుంచి సేకరించిన లైమ్స్టోన్ను వినియోగిస్తున్నామని వివరించారు. ఈ ఆలయ పునరుద్ధరణ ద్వారా తెలంగాణలో మరో పురాతన ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.