టీఎస్ఎఫ్పీజెడ్ల ఫీజుపై ఔత్సాహికుల ఫోన్లు
10 లక్షల నిబంధనపై పునరాలోచించాలని వినతి
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్జోన్ల (టీఎస్ఎఫ్పీజెడ్) కోసం దరఖాస్తుతోపాటు నిర్ణయించిన రూ.10 లక్షలు అడ్వాన్స్ డిపాజిట్ను ఫీజు తగ్గించాలని ఔత్సాహికులు కోరుతున్నారు. అప్లికేషన్ ఫీజుగా రూ.5 వేలు వసూలు చేస్తున్న నేపథ్యంలో రూ.10 లక్షల అడ్వాన్స్ ఫీజు నిబంధన తొలగించాలని కోరుతున్నారు. ఆహార ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్జోన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు www.tsiic. telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఔత్సాహికులు టీఎస్ఐఐసీకి ఫోన్లుచేస్తూ రూ.10 లక్షల అడ్వాన్స్ ఫీజుపై అభ్యంతరం తెలుపుతున్నారని అధికారులు తెలిపారు. ఎన్ని జిల్లాల్లో దరఖాస్తు చేస్తే అన్నిజిల్లాలకు విడివిడిగా దరఖాస్తు చేయడంతోపాటు, రూ.10 లక్షల చొప్పున ఫీజు చెల్లించాలనే నిబంధనపై పునరాలోచన చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. అప్లికేషన్ ఫీజు రూ.5,000 వసూలు చేస్తున్నప్పటికీ, అడ్వాన్స్ ఫీజు ఏమిటని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.