హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలను పాటించని రియల్ ఎస్టేట్ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రెరా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన పలు సంస్థలకు రెరా సెక్రటరీ బాలకృష్ణ బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేసి, 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ/జీహెచ్ఎంసీ/యుడీఏ/స్థానిక సంస్థల అనుమతులతోపాటు టీఎస్ రెరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ప్రీ లాంచింగ్, యూడీఎస్, ఈవోఐ తదితర కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశా రు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలం లో చేపట్టే నిర్మాణాలతోపాటు ఎనిమిది లేదా అంతకుమించిన ప్లాట్లు, నిర్మాణాలకు రెరా చట్టం వర్తిస్తుందని తెలిపారు. అటువంటి ప్రాజెక్టులను చేపట్టేవారంతా ఆయా సంస్థల అనుమతులు పొందిన తర్వాత విధిగా రెరాలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.