హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నినాదాల్లో ఒకటైన నియామకాల భర్తీలో కేసీఆర్ సర్కారు రికార్డు సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏకంగా 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేసి కొత్త చరిత్ర లిఖించింది. మరో 91,142 ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. అందులో 11,103 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా, మరో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్ నోటిఫికేషన్లు విడుదల కాగా మరికొద్ది రోజుల్లో మిగిలిన నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నది.
అత్యధిక జీతాలు తెలంగాణలోనే..
పీఆర్సీతో లబ్ధిపొందిన వారు
ప్రభుత్వ ఉద్యోగులు 9,17,797
పెన్షనర్లు 2,88,416
హోంగార్డులు 16,460
అంగన్వాడీ టీచర్లు 67,411
ఆశావర్కర్లు 31,028
సీఆర్ బిశ్వాల్ పీఆర్సీ కమిటీ 7.5శాతం సిఫార్సుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం 30 శాతంతో 2020 ఫిట్మెంట్ పీఆర్సీని ప్రకటించింది. కరోనాతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయినా ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధపడింది. గతంలో 2015లో 43 శాతం ఫిట్మెంట్తో తెలంగాణ పీఆర్సీని వర్తింపజేసింది. ఈ రెండు పీఆర్సీల అమలుతో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులయ్యారు. అంతేకాకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61కి పెంచింది. ఈ నిర్ణయంతో 2021 మార్చి నుంచి 2024 వరకు ఒక్క ఉద్యోగి సైతం పదవీ విరమణ పొందలేని రాష్ట్రమయ్యింది.