బోయినపల్లి, జూన్ 14: రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సమిష్టిగా కూర్చోని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతోపాటు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
రేషనలైజేషన్ అనేది పెద్ద సమస్య అని, విజ్ఞులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుందని, ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవ సేనను అడిగినట్టు చెప్పారు. అందుకు ఆమె పని విభజన పేరిట ఉపాధ్యాయులు పని చేయాలని రాష్ట్రంలోని అన్ని డీఈవో కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారని ఆయన పేర్కొన్నారు. జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు కూడా మానవతా దృక్పథంతో అదే పాఠశాలలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన చేయాలని, ఆ విద్యార్థులు మళ్లీ అదే జడ్పీ పాఠశాలకు వస్తారని వినోద్కుమార్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే ఉపాధ్యాయులు పునరాలోచించాలని కోరారు.