విద్యానగర్, సెప్టెంబర్ 25: కరీంనగర్ జిల్లా నగునూర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు ఓ యువకుడికి ఉచితంగా అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్కు చెందిన ఆటో డ్రైవర్ రమేశ్ కొడుకు అంజనీశివపుత్ర(18) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని పలు కార్పొరేట్ దవాఖానలకు వెళ్లగా ఇలాంటి వ్యాధులకు బెంగళూర్, చెన్నైలో మాత్రమే శస్త్రచికిత్స చేస్తారని వైద్యులు సూచించారు. చికిత్సకు 10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. నగునూర్లోని ప్రతిమ దవాఖానలో డాక్టర్ ఆశీష్ బృందం అత్యవసర, క్రిటికల్, గుండె శస్త్ర చికిత్స చేస్తున్నారని తెలుసుకున్న రమేశ్.. ఈనెల 2న తన కొడుకును దవాఖానకు తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు విషయాన్ని దవాఖాన చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి ఉచితంగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులను ఆదేశించారు. ఆ మేరకు ఈ నెల 6న డాక్టర్ ఆశీష్ బృందం అంజనీశివపుత్రకు రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఎంఐసీఎస్ (రెండో ఐసీఎస్ 5 సెంటీ మీటర్ల కోత) ద్వారా రిడూ అయోర్టిక్ కవాట మార్పిడి చేశారు. వైద్యులు కే రవీందర్రెడ్డి, ఆశీష్ భావిస్కర్, నిఖిల్ బృందం శస్త్ర చికిత్సను విజయవంతంచేసింది. అంజనీశివపుత్ర పూర్తిగా కోలుకోవడంతో ఈనెల 16న డిశ్చార్జి చేశారు. తమకొడుకు ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రులు ప్రతిమ దవాఖాన వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.