పాలకుర్తి మే 15: మహాకవి పాల్కురికి సోమనాథుని జన్మస్థలమైన జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం-2022 సంవత్సరానికి ద్వైవార్షిక పురస్కారాలకు దేశవ్యాప్తంగా సాహితీ వేత్తల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్టు సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన పాలకుర్తిలో మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుని జీవిత, సాహిత్యాలపై గణనీయమైన పరిశోధన చేసిన వారు, ఆయన ఆలోచనా ధారను ప్రచారం చేసిన వారు సోమనాథ సాహిత్య పురస్కారం, సోమనాథుని భావజాలాన్ని ప్రధానంగా తీసుకొని కృషి చేసిన వారికి సోమనాథ సామాజిక శోధన పురస్కారం ఇవ్వనున్నట్టు తెలిపారు.
నాటక రంగాన సాధన చేసిన వారికి సోమనాథ రంగస్థల పురస్కారం, తెలుగు భాషా సాహిత్యానికి సేవ చేసిన వారికి పందిళ్ల శేఖర్బాబు, రాజయ్యశాస్త్రి, స్వచ్ఛంద భాషా సేవ పురస్కారం, సాహిత్య రసాస్వాదనకు కృషి చేస్తున్న వారికి వీ చలపతిరావు సాహిత్య పురస్కారం, పురా చరిత్రలో వైజ్ఞానిక అంశాలను వెలికితీసిన వారికి ముశం దామోదర్రావు ప్రాచీన చరిత్ర పరిశోధన పురస్కారం, సాహిత్య కళారంగంలో ప్రతిభామూర్తులకు దేవగిరి రాజయ్య స్మారక బిరుదు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పూర్తి సమాచారంతో డాక్టర్ రాపోలు సత్యనారాయణ అధ్యక్షుడు, సోమనాథ కళాపీఠం, పాలకుర్తి-506146, జనగామ జిల్లా, తెలంగాణ, ఫోన్ 9440163211 చిరునామాకు మే 31లోగా ప్రతిపాదనలు అందజేయాలని ఆయన కోరారు.