హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలో కాలే య వ్యాధులు వేగంగా పెరిగిపోతున్నాయని, దీనిపై అందరికీ అవగాహన అవసరమని యశోద హాస్పిటల్ గ్యాస్ట్రో వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి ‘బ్రిడ్జ్ ది గ్యాప్స్-లివర్ చాప్టర్’పై హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో నిర్వహించిన జాతీయ సదస్సు, లైవ్ వర్క్షాప్లో పలువురు వైద్యనిపుణులు కాలేయ వ్యాధులపై చర్చించారు.
కాలేయ వ్యాధులు దేశంలో అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతున్నాయని, ప్రతి ఐదుగురు పెద్దలలో ఒకరు దీని బారిన పడుతున్నారని వెల్లడించారు. కాలేయ వ్యాధి సంబంధిత మరణాలు సంవత్సరానికి 2,68,580 (మొత్తం మరణాలలో 3.17శాతం)కి చేరుకున్నట్టు నిపుణులు వివరించారు. విస్తరిస్తున్న వ్యాధుల బారి నుంచి తప్పించుకునేందుకు పాటించాల్సిన జాగ్రతలు, రోగుల సంరక్షణ, పరిశోధన, వైద్య విద్యలో కొత్త ప్రమాణాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.
ముఖ్యంగా వైరల్ హెపటైటిస్, ఫ్యాటీ లివర్, లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్లకు సంబంధించిన సమస్యలను ఈ సదస్సులో చర్చించారు. ఈ సదస్సులో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, డాక్టర్ నవీన్ పోలవరపు, డాక్టర్ సంతోష్ ఎనగంటి, కేఎస్ సోమశేఖర్రావు, డాక్టర్ గోపీ శ్రీకాంత్, డాక్టర్ శరత్చంత్ర గోరంట్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 500 మంది మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రో నిపుణులు పాల్గొన్నారు.