అనతికాలంలోనే తెలంగాణను అనేక రంగాల్లో నంబర్ వన్గా నిలిపిన సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.అన్ని రంగాల్లో రాష్ట్రం అద్వితీయంగా పురోగమించేందుకు పాలనారథాన్ని మరింత దౌడు తీయిస్తున్నారు. అధికారులతో సమీక్షలతోనే సరిపెట్టకుండా తానే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు పరమావధి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ సందర్భంలోనూ నిరూపిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక అనంతరం రాష్ట్ర పాలనయంత్రాంగాన్ని తిరిగి పరుగులు పెట్టిస్తున్నారు సీఎం కేసీఆర్. అన్ని రంగాల్లో రాష్ట్రం అద్వితీయంగా పురోగమించేందుకు పాలనారథాన్ని మరింత దౌడు తీయిస్తున్నారు. నిర్దేశిత ప్రగతిని నిర్ణీత గడువులో పూర్తిచేసేందుకు ఒకవైపు ప్రగతిభవన్లో ఆయా శాఖల ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు క్షేత్రపర్యటనలకూ సీఎం సిద్ధమవుతున్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ల వరకు, తహసీల్దార్ల నుంచి పంచాయతీ కార్యదర్శుల దాక అందరూ ఉద్యమస్ఫూర్తితో కార్యాచరణను అమలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సహా జిల్లాలన్నింటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఇతర శాఖల మంత్రులు సైతం ఆయా జిల్లాల్లో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టేందుకు సమస్త అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరుస్తూ టీఎస్పీఎస్సీకి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమర వీరుల స్మృతిచిహ్నం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించటమే కాకుండా పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర విద్యుత్తురంగ చరిత్రలో మైలురాయిలా నిలిచిపోయే దామరచర్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గత నెల 26న మున్సిపల్ శాఖ, ప్రత్యేకించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. 27న రైస్మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రగతిసిగలో చిరస్థాయిగా నిలిచే మైట్రోరైల్ పనుల పురోగతిపైనా ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి 18 నుంచి కంటివెలుగు రెండోదశ చేపట్టేందుకు ఇటీవల వైద్యఆరోగ్యశాఖతో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకోవటమే కాకుండా, ఆ కార్యక్రమ నిర్వహణకు రూ.200 కోట్లు కేటాయించారు.
ప్రగతి పనులపై మరింత దృష్టి సారించాలని మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ .. పురోగతిలో ఉన్న పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనల్లో బిజీగా గడుపుతున్నారు. జిల్లా, నియోజకవర్గస్థాయి సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపే పనిలో ప్రజాప్రతినిధులు తలమునకలయ్యారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిత్యనూతన ప్రగతికి దారులు వేస్తున్నది. పట్టణాభివృద్ధిని మంత్రి కేటీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. శుక్రవారం నుంచి డిసెంబర్ చివరి వరకు వరుస కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం కూకట్పల్లిలో, 5న బన్సీలాల్పేటలో, 6న బండ్లగూడలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదేరోజు వరంగల్-విజయవాడ హైవేలను కలుపుతూ పీర్జాదిగూడలో రూ.30 కోట్లతో నిర్మించిన లింకు రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నా రు. ఇదేరోజు వనస్థలిపురంలో రూ.18 కోట్లతో నిర్మించే శాటిలైట్ బస్ టెర్మినల్కు శంకుస్థాపన, ఫతుల్లాగూడలో కోటి రూపాయలతో నిర్మించిన శునక శ్మశానవాటిక (కుక్కల కోసం ప్రత్యేకంగా నిర్మించిన క్రెమటోరియం)ను ప్రారంభించనున్నారు. అలాగే రూ.270 కోట్లతో కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభించి మహానగర సిగలో మరో కలికితురాయిని తురిమేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏ స్థాయిలో హోంవర్క్ చేస్తారనేందుకు గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న సమీక్షే నిదర్శనం. మునుగోడు ఎన్నికల సందర్భంగా ‘ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తా..’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎన్నికలయ్యాక మంత్రుల బృందాన్ని మునుగోడుకు పంపిస్తానంటూ సీఎం కేసీఆర్ చండూరు బహిరంగ సభలో పేర్కొన్నట్టుగానే గురువారం మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ మునుగోడులో సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు కేంద్రంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కోసం రూ.1,544 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఈ నెల 7న సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి అనంతరం 2 లక్షల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రజాప్రతినిధులు గురువారం పర్యవేక్షించారు.