ఫర్టిలైజర్సిటీ, డిసెంబర్ 8: సీపీఐ మావోయిస్టు పార్టీ కోల్బెల్ట్ ఏరియాలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖనికి వచ్చిన మావోయిస్టు పార్టీ సభ్యుడిని రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఒంటి గంటకు గోదావరిఖని పట్టణంలోని ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయ జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి చేతిలో సంచితో సీఎస్పీ కాలనీ వైపు వెళ్తున్నాడు.
అనుమానంతో పోలీసులు అతడి వద్దకు వెళ్తుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని పట్టుకొని విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నాదెళ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన మావోయిస్టు మామిడిమల్ల అవినాశ్ అలియాస్ మల్లేశ్ (29) అని తెలిసింది. సికాస కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ ఆదేశాలతో గోదావరిఖనికి వచ్చినట్టు అవినాశ్ తెలిపాడు. రెండేండ్ల క్రితం సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరి పనిచేస్తున్నాడని, సికాస కార్యకలాపాలను విస్తరించే పనిలో గోదావరిఖనికి వచ్చినట్టు సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు. అతడి వద్ద నుంచి వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.