తిరుమల : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ ప్రాంగణంలో శాలువాతో సత్కరించి ,తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం జన్మించిన కారణజన్ములు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజల ఆరోగ్య కష్టాలు తీర్చేందుకు మెడికల్ కళాశాల ప్రసాదించారన్నారు. నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామివారు ప్రసాదించాలని కోరుకున్నానని ఆయన వివరించారు.