హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యేనని, దీనిపై ఎలాంటి అనుమానాలకు తావులేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు ఆరుగురు ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారని తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘గురువారం కోణార్క్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వైపు వస్తున్నప్పుడు ఉదయం 9-05 గంటలకు ఈ ఘటన జరిగింది. రాజు రైలు కింద పడటం ఆ రైలు నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్లు చూశారు. వాళ్లు వెంటనే స్టేషన్ఘన్పూర్లో స్టేషన్ మాస్టర్కు ఈ విషయాన్ని తెలియజేశారు. మళ్లీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాళ్ల అంతర్గత సమాచారంలోనూ ప్రమాద విషయాన్ని నమోదుచేశారు. రైల్వే ఉన్నతాధికారులకు కూడా అధికారికంగా సమాచారం ఇచ్చారు. వీరిద్దరితోపాటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పనిచేస్తున్న రైతులు కూడా కండ్లారా ఈ విషయాన్ని చూశారు. గురువారం ఉదయం 6-30 గంటల సమయంలో ఓ గ్యాంగ్మెన్ ట్రాక్ చెక్ చేసుకొంటూ వెళ్తున్నప్పుడు రాజు అతడికి తారసపడినట్టు చెప్పారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజును ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయినట్టు తెలిపారు. ఆ గ్యాంగ్మెన్ పనిపూర్తిచేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అతడికి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని చెప్పారు. ఇట్లా ఆ పక్కన పొలాల్లో ఉన్న ముగ్గురు రైతులు, ఇద్దరు లోకో పైలట్లు, గ్యాంగ్మెన్ ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యులు. అందరి వాగ్మూలం వీడియో రికార్టు చేశాం. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు’అని డీజీపీ వివరించారు. రాజు ఆత్మహత్యపై ప్రజల్లో అనవసర అనుమానాలకు తావిచ్చేలా ఎవరూ మాట్లాడకూడదని సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సంచలనం సృష్టించిన సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్యపై న్యాయవిచారణకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రాజు ఆత్మహత్యపై వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విచారణ జరపాలని ఆదేశించింది. నాలుగువారాల్లోగా విచారణ పూర్తిచేసి సీల్డ్కవర్లో నివేదిక అందజేయాలని స్పష్టంచేసింది. వరంగల్ ఎంజీఎం దవాఖానలో రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు చిత్రీకరించిన వీడియోను శనివారం రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జడ్జికి అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వీడియోను హైకోర్టు రిజిస్ట్రీకి పంపాలని వరంగల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ అమర్నాథ్గౌడ్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పోలీసులే రాజును హతమార్చి, స్టేషన్ఘన్పూర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర పౌరహకుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ దాఖలుచేసిన పిల్పై శుక్రవారం విచారణ జరిగింది. రాజు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొంటున్నప్పుడు చూసిన ఏడుగురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు వీడియో తీశారని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. రాజును హతమార్చి రైల్వేట్రాక్పై పడేశారన్న తప్పుడు ఆరోపణలతో పిటిషనర్ కోర్టు సమయాన్ని వృథాచేస్తున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. రాజు మృతిపై అనుమానాలున్నందున న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు వెల్లడించింది.