దేశంలోనే తొలి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్
రాజేశ్ ఎక్స్పోర్ట్స్ పెట్టుబడి 24 వేల కోట్లు
ఇక మన దగ్గరా అమోలెడ్ డిస్ప్లేల తయారీ
జపాన్, కొరియా, తైవాన్ సరసన తెలంగాణ
బెంగళూరులో కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ
రాష్ర్టానికి ఇది చారిత్రాత్మక రోజు: మంత్రి కేటీఆర్
డిస్ప్లే ఫ్యాబ్ ప్లాంట్ అంటే..
డిస్ప్లే ఫ్యాబ్(ఫ్యాబ్రికేషన్) ప్లాంట్లో ల్యాప్టాప్, ట్యాబ్, మొబైల్లో ఉపయోగించే స్క్రీన్లను తయారు చేస్తారు. గాజు ఫలకలపై ఒత్తిడి పెంచి సంక్షిష్లంగా రూపొందించి, వీటిని ట్రాన్సిస్టర్ సెల్స్కు అనుసంధానం చేస్తారు. ఇందుకోసం సిలికాన్, లోహాలను వినియోగిస్తారు. ఈ స్క్రీన్లకు విద్యుత్తును పంపి వెలిగిస్తారు.
ప్రపంచ పటంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపినం
హైటెక్ తయారీ రంగంలో భారతదేశాన్ని మరోసారి ప్రపంచపటంలో తెలంగాణ ముందువరుసలో నిలిపింది. జపాన్, కొరియా, తైవాన్ సరసన తెలంగాణ నిలిచింది. ప్రపంచస్థాయి టీవీ, స్మార్ట్ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు అసవరమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అనువైన ఎకోసిస్టమ్ రూపొందింది. అమోలెడ్ డిస్ప్లే యూనిట్లను తయారుచేయడానికి హైదరాబాద్లో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ రూ.24000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఇది తెలంగాణకు చారిత్రాత్మక రోజు.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): భారత్లో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భాసిల్లుతున్న తెలంగాణ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ రంగంలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) ఈ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి తన డిస్ప్లే ఫ్యాబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణాకు ఎన్నో పెట్టుబడులు వచ్చినప్పటికీ ఇదే అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం. టీవీలు, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్ల తయారీకి ఉపయోగించే అత్యాధునిక అమోలెడ్ డిస్ప్లేల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు ఎలెస్ట్ వెల్లడించింది.
ఈ మేరకు ఆ కంపెనీ ఆదివారం బెంగళూరులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్ర భుత్వంతో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకొన్నది. దీనిపై రాజేశ్ ఎక్స్పోర్ట్స్ గ్రూప్ చైర్మన్ రాజేశ్ మెహతా, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. దీంతో దేశీయ డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలెస్ట్ చరిత్రకెకనున్నది. హైదరాబాద్లో ఈ కం పెనీ నెలకొల్పే యూనిట్ ద్వారా దాదాపు 3 వేల మంది సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులకు ప్రత్యక్షంగా, అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన అనుబంధ సంస్థలు, వేల మంది సరఫరాదారులకు పరోక్షం గా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఎలెస్ట్ కంపె నీ అమోలెడ్ డిస్ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైంది. ప్రపంచంలోని అత్యుత్తమ డిస్ప్లే ఫ్యాబ్ కంపెనీలకు దీటుగా ఎలెస్ట్ హైదరాబాద్ యూనిట్లో 6వ తరం అమోలెడ్ డిస్ప్లేలను తయారు చేయనున్నది. మొదట నగర శివారులోని దుండిగల్లో 50 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండగా, ఆ తర్వాత మరో 300 ఎకరాల్లో అత్యంత ఆధునాతన తయారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది.
అమెరికా, చైనాల సరసన భారత్: కేటీఆర్
డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో ఎలెస్ట్ నుంచి భారీ పెట్టుబడి రావడం తెలంగాణతోపాటు యావత్ దేశానికే గర్వకారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడితో భారత్ అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన నిలుస్తుందని, ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్కు మాత్రమే సాధ్యమైన అడ్వాన్స్డ్ హైటెక్ ఉత్పత్తులు ఇకపై తెలంగాణలోనూ తయారవుతాయని తెలిపారు. దేశంలో సెమీకండక్టర్ మిషన్ను ప్రకటించిన తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎలెస్ట్ కంపెనీ ముందుకు రావడంతో తమ కృషి ఫలించినట్టయిందన్నారు. ఎలెస్ట్ రాకతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఎకో సిస్టం మరింత బలోపేతమై డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, తద్వారా అనుబంధ రంగాల అభివృద్ధికి గణనీయ అవకాశాలు ఏర్పడతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
భారత్లోనే తొలిసారి: సుజయ్ కారంపురి
ఇప్పటివరకు భారత్లో ఎక్కడా లేని హైటెక్ మ్యాన్యుఫ్చాక్చరింగ్ కంపెనీ తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు కానున్నదని తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి తెలిపారు. అమోలెడ్ డిస్ప్లేల తయారీ కోసం రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) కంపెనీ హైదరాబాద్ శివారు దుండిగల్లో యూనిట్ను నెలకొల్పనున్నరన్నారు. ఆరేండ్లలో ఈ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నట్టు తెలిపారు. తెలంగాణతోపాటు యావత్ దేశానికే గర్వకారణమైన ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రపంచంలోని దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు రాష్ర్టానికి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు.
భారత్ నుంచి ఫ్యూచర్ టెక్నాలజీ: రాజేశ్ మెహతా
తెలంగాణలో తాము ఏర్పాటు చేయనున్న డిస్ప్లే ఫ్యాబ్ ప్లాంట్తో ప్రపంచంలోని అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని రాజేశ్ మెహతా పేర్కొన్నారు. తద్వారా భారత్ నుంచి ప్రపంచానికి ఫ్యూచర్ టెక్నాలజీని అందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసే తమ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మంది సైంటిస్టులు, ఇతర టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈవో శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో కొన్ని దిగ్గజ సంస్థల భారీ పెట్టుబడులు
ఒప్పో స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ మొదటిసారిగా హైదరాబాద్లో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్, ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేసింది.
గూగుల్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో 7.3 ఎకరాల్లో నిర్మించేందుకు ఇటీవల భూమిపూజ చేసింది.