(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): 50 ఏండ్ల కిందటి ముచ్చట ఇది. వాణిజ్య అవసరాల కోసం చెట్లను నరికేయడంతో నేల కోతకు గురై దేవభూమి ఉత్తరాఖండ్లో తరుచూ వరదలు సంభవించడం 1970లో నిత్యకృత్యమైంది. దీన్ని గమనించిన సుందర్లాల్ బహుగుణ, గౌరాదేవీ వంటి సామాజిక కార్యకర్తలు.. 1973లో ‘చిప్కో ఆందోళన్’కు పిలుపునిచ్చారు. ఈ వృక్షరక్షణ ఉద్యమం యావత్తు ప్రపంచ దేశాలను ఆకర్షించింది. దీంట్లో రేనీ గ్రామస్థులు కీలక పాత్ర పోషించారు. కాలగమనంలో ఐదు దశాబ్దాలు గడిచాయి. ‘చిప్కో ఆందోళన్’కు వేదికగా నిలిచిన అదే ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. రాజకీయ ప్రయోజనాలు, అనాలోచిత నిర్ణయాలతో కొండప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. దీంతో ప్రకృతి మళ్లీ కన్నెర్రజేసింది. ఫలితం.. రెండేండ్ల కిందట చమోలీ జిల్లాలో ధౌలి గంగా నది ఉప్పొంగిన ఘటనలో 200కు పైగా మంది మృత్యువాతపడ్డారు. ఇప్పుడు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం జోషీమఠ్ భూమి కుంగిపోతూ క్రమంగా పట్టణమే అంతర్ధానమవుతున్నది. ఈ విపత్కర పరిస్థితులను చూసిన రేనీ గ్రామస్థులు మరో ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వ ఏకపక్ష చర్యలకు నిరసనగా, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులందరూ మరో చిప్కో ఆందోళన్కు నడుంకట్టారు.
మా గ్రామమంతా ప్రమాదంలో ఉన్నది. పల్లెలోని ప్రతీ ఇంటి గోడలపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లే. ఇక మాకు మిగిలిన ఏకైక మార్గం ఉద్యమమే.
– మల్కీ దేవి, రేనీ గ్రామస్థురాలు