BC Reservation Bill | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 26న రాష్ర్టంలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలతో . తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ సహకారం, మద్దతు ప్రకటించారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమ కార్యాచరణను జలవిహార్ సదస్సులో రూపొందిస్తామని చెప్పారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని, అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. శనివారం హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఆమెతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులతో కలిసి ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు తాము చేపట్టబోయే ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి జాగృతి సంస్థ ద్వారా కవిత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేశారని, బతుకమ్మ ఖ్యాతిని పెంచటంలో క్రియాశీల పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో మహిళా బిల్లు కోసం అనేక ప్రయత్నాలు చేశారని ప్రశంసించారు. పార్లమెంట్ ఆమోదించిన మహిళా బిల్లుపై కవిత సంతృప్తిగా లేరని, బిల్లులో బీసీలకు అన్యాయం జరిగిందనే కచ్చితమైన అభిప్రాయంతో కవిత ఉండటం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
బీసీలకు కేంద్రం తీరని అన్యాయం: వకుళాభరణం
దశాబ్దాల పోరాటాల తరువాత పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. మహిళా బిల్లు కోసం పోరాటం చేసి సఫలం అయినట్టే బీసీ బిల్లు కోసం సహకరించాలని ఎమ్మెల్సీ కవితను కోరామని, అందుకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. బీసీలు మూడు ప్రధాన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నామని, తెలంగాణ నుంచే ఆ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. క్రీమీలేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని, కనీసం 2011 జనాభా లెక్కలను కూడా బయటపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక రాష్ర్టాల బీసీ కమిషన్లు చేసిన సిఫారసులను కేంద్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
బీసీల కోసం బీఆర్ పోరు: వద్దిరాజు, రమణ
బీసీల ప్రయోజనాల పరిరక్షణ కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకన్నా బీఆర్ ముందే ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తరువాత మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ సర్కారు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం సాగే పోరాటంలో సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. బీసీల పోరాటానికి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవితకు బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రం మెడలు వంచుతాం
తెలంగాణ నుంచే బలమైన బీసీ ఉద్యమ నిర్మాణం చేపట్టి కేంద్రం మెడలు వంచి తీరుతామని కృష్ణయ్య స్పష్టం చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిం చటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కుల గణన డిమాండ్లతో జాతీయ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని చెప్పారు. దశాబ్దాల నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమిస్తున్నామని, ఇప్పటికే 85 సార్లు ఢిల్లీలో ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు. దేశాన్ని ఏలిన ప్రధానమంత్రులను 65 సార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటాన్ని తాము స్వాగతిస్తూనే అందులో బీసీలకు చోటులేకపోవడంపైనా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
ఇదే మోఖా.. కలిసిపోరాడుదాం: అల్లం
మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన స్ఫూర్తితో బీసీ బిల్లు కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం తెలంగాణ ప్రభుత్వం దశాబ్దం క్రితమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటమే కాకుండా ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం పార్టీలకు, సంఘాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళా బిల్లులో బీసీలకు సముచితస్థానం దక్కేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల చిక్కుముడి వీడకుండా మహిళా బిల్లు సాకారం కాదనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. బీసీ బిల్లును కోరేవాళ్లంతా మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారనే అపోహలు సృష్టించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.