హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తిరుమల వెళ్లే భక్తులకు వివిధ దర్శనాల టికెట్ల కోటా విడుదల వివరాలను మంగళవారం ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై నెల కోటాను ఈ నెల 20న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. 22న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్లో టికెట్లు మంజూరు చేస్తారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఈ నెల 20న, మే, జూన్ నెలల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25న విడుదల చేయనున్నది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల జూలై నెల ఆన్లైన్ కోటాను ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు, అదేనెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నది.