హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్లోని అర్హతలే అంతిమమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి 2017లో టీఎస్పీఎస్పీ ఇచ్చిన నోటిఫికేషన్లో పీజీలో చదివిన సబ్జెక్టులకు అనుగుణంగా బీఈడీలో టీచింగ్ మెథలాలజీ సబ్జెక్ట్ ఉండాలని నిబంధన పెట్టింది. బీఈడీలో, పీజీలో ఒకే రకమైన సబ్జెక్టులు చదివిన వారు అర్హులని కూడా తెలిపింది. పీజీలో చదివిన సబ్జెక్టుకు, బీఈడీలో టీచింగ్ మెథడాలాజీ వేర్వేరుగా ఉన్న వారిని కూడా అర్హులుగా పరిగణించేలా ఉత్తర్వులు జారీచేయాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన కే శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రిన్సిపాల్ పోస్టుకు ఒకే తరహా సబ్జెక్టులు చేసుండాల్సిన అవసరం లేదన్న వారి వాదనను సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. దీనిపై పిటిషనర్లు అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల కొట్టేసింది. టీఎస్పీఎస్పీ తరఫు న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్ బీఈడీలో బయోసైన్స్, తెలుగులో మెథడాలజీ, పీజీలో కెమిస్ట్రీ చేశారని, ఇదే తరహా పిటిషన్ను గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని గుర్తుచేశారు. వాదనల అనంతరం ధర్మాసనం, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పాఠశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టులకు సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లోని అర్హతలే అంతిమమని తేల్చింది. అప్పీల్ పిటిషన్ను కొట్టేసింది.