హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రజా పంపిణీ(పీడీఎస్) బియ్యం అక్రమ రవాణాకు, గోనె సంచుల అవకతవకలకు ప్రభుత్వం చెక్ పెట్టనున్నది. గోనె సంచులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్(చిప్) లేదా క్యూఆర్ కోడ్ను ముద్రించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రప్రభుత్వం అమలు చేయనుండటం గమనార్హం. తొలుత పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తతం 1,160 గన్నీ సంచులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లను అమర్చారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. మిల్లింగ్ పాయింట్స్, మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్స్, రేషన్ షాపుల్లో ఇలా ప్రతి చోట స్కానర్లు ఏర్పాటు చేసి ప్రతి బ్యాగ్ను ప్రతి దశలో స్కాన్ చేస్తారు. దీంతో ఏ బ్యాగ్ ఎక్కడుందనేది తెలిసిపోతుంది. పౌరసరఫరాల శాఖ ఏటా 11 కోట్ల గోనె సంచులను ఉపయోగిస్తున్నది. వీటిలో 30 శాతానికి మించి తిరిగి రావటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి సంచి లెక్క తేల్చేందుకు ట్రాకింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఏ రేషన్షాపునకు ఎంత స్టాక్ వెళ్లింది? పంపిణీ తర్వాత స్టాక్ మిగిలిందా? లేదా? అన్న విషయాలను కూడా తెలుసుకొనే వీలుకలుగనున్నది.
గన్నీ బ్యాగ్లకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్/క్యూఆర్ కోడ్ ఏర్పాటుతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూడా చెక్ పడనున్నది. ఈ విధానంతో సగానికి పైగా రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గిపోయే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ఏ బ్యాగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడ ఉన్నదనే.. విషయాలను సులువుగా తెలుసుకొనే వీలు కలుగుతుందని చెప్తున్నారు.