హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): వందేండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రోను విస్తరించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై జేపీ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేపీ గురించి గొప్పగా ఊహించుకున్నామని, కానీ మెట్రో విస్తరణపై చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని చూపిస్తున్నాయని మండిపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసమే విస్తరణ అన్న విషయం సూడో మేధావికి తెలియకపోవడం విడ్డూరమంటూ విరుచుకుపడుతున్నారు.
దేశంలో 70శాతం ఆదాయం ఆరేడు నగరాల నుంచే వస్తున్నది, అందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తున్నదని గుర్తు చేశారు. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఎన్సీఆర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లక్షకోట్లు ఖర్చు పెడుతున్నదని, ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా విస్తరణ చర్యలు చేపట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మెట్రో విస్తరణకు దాదాపు రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే హైదరాబాద్ మెట్రో మాత్రం కిలోమీటరుకు రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేయబోతున్న విషయం జేపీకి తెలియకపోవడం సిగ్గుచేటని ఆడుకుంటున్నారు.