న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చాలా దగ్గరగా వచ్చాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. ముందుగా జూన్ 1ననే రుతుపవనాలు కేరళకు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. మందగమనం కారణంగా మరో రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 3 నాటికి రుతు పవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంచేసింది.
ఈ రోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమిటర్ల ఎత్తువరకు ఏర్పడిందని తెలిపింది. అంతే కాకుండా ఉపరితల ఆవర్తనం తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు నుంచి 7.6 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని తెలిపింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.