హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ అభ్యర్థిని పీఆర్టీయూ-తెలంగాణ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్దన్రెడ్డి తమ అభ్యర్థిగా పోటీ చేస్తారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్న య్య, మారెడ్డి అంజిరెడ్డి ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, అధ్యాపక ఓటర్లంతా జనార్దన్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి పీఆర్టీయూ(టీఎస్) నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహించారు. 2017లో పీఆర్టీయూ(టీఎస్) నుంచే ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పదవీకాలం 2023 మార్చి 29తో ముగియనున్నది. ఈసా రి ఎన్నికల్లో సిట్టింగ్ అయిన జనార్దన్రెడ్డిని కాదని పీఆర్టీయూ(టీఎస్) గుర్రం చెన్నకేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిం ది. ఈ నేపథ్యంలో జనార్దన్రెడ్డిని పీఆర్టీయూ తెలంగాణ బరిలోకి దింపింది.
రసవత్తర పోరు..
ఈసారి ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారనున్నది. ఇప్పటికే పీఆర్టీయూ(టీఎస్) నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ నుంచి మాణిక్రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు, లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసొసియేషన్ నుంచి డాక్టర్ ఎస్ రవీందర్, తెలంగాణ స్కూల్స్ అండ్ టెక్నికల్ కాలేజెజ్ ఎంప్లాయిస్ అసొసియేషన్ నుంచి అయినేని సంతోశ్కుమార్, జీటీఏ నుంచి కాసం ప్రభాకర్, టీయూటీఎఫ్ నుంచి మల్లారెడ్డిల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. మొత్తంగా ఓటర్ల సంఖ్య 25 వేల వరకు ఉండే అవకాశమున్నది.