హైదరాబాద్, నవంబర్25 (నమస్తే తెలంగాణ): ఆదాయపు పన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్పై బోయిన్పల్లి పీఎస్లో నమోదైన కేసు విచారణను హైకోర్టు నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీచేసింది. రత్నాకర్ను నాలుగు వారాలపాటు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఆదాయపు పన్నుశాఖ సోదాల సందర్భంగా తన సోదరుడిపై దాడిచేశారని, పంచనామా పత్రాలపై దౌర్జన్యంగా సంతకాలు చేయించేందుకు బుధవారం అర్ధరాత్రి దురుసుగా ప్రవర్తించారని రత్నాకర్పై మంత్రి మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
దీంతో పోలీసులు రత్నాకర్పై ఐపీసీ 384 (దోపిడీ) కింద కేసు నమోదైంది. ఈ కేసును రత్నాకర్ హైకోర్టులో సవాల్చేశారు. కేసును కొట్టేయాలని, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని శుక్రవారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కే సంతోష్ స్టే విధించారు. బోయిన్పల్లి పోలీసులు నమోదుచేసిన కేసు విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. నాలుగు వారాలపాటు రత్నాకర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించారు.