హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ భాష, పదజాలంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వారంలో ప్రత్యేకంగా రెండు పీరియడ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పీరియడ్స్లో ఇంగ్లిష్ పుస్తకాలను చదివించడం, అభ్యాసాలు చేయించడం, పరస్పరం సంభాషించడం, మాట్లాడించడం, స్టోరీలు చెప్పడం లాంటివి చేయిస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడులన్నింటిలో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రస్తుతం బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తున్నారు. జూలై 1 నుంచి రెగ్యులర్ పాఠాలను బోధిస్తారు. ఇప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదువుకొన్న విద్యార్థులు ఇప్పటికిప్పుడు ఆంగ్ల మాధ్యమంలోకి మళ్లడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రెగ్యులర్ బోధనతోపాటు ఇంగ్లిష్పై అవగాహన పెంచేందుకు వారంలో రెండు పీరియడ్లు అదనంగా నిర్వహించనున్నారు.
వాల్యూ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం
పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను నేర్పించేందుకు (వాల్యూ ఎడ్యుకేషన్కు) అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వల్ల గత రెండేండ్లు తరగతులు అంతంత మాత్రంగా జరగడంతో విద్యార్థుల ప్రవర్తనలో అనేక మార్పులు వచ్చాయి. పెద్దలను గౌరవించకపోగా సెల్ఫోన్లు, కంప్యూటర్ల ప్రభావంతో అనేక మంది దురలవాట్ల బారినపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది వాల్యూ ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా పీరియడ్స్ను నిర్వహించాలని, విద్యార్థులకు పరీక్ష నిర్వహించి మార్కులు వేయాలని స్పష్టం చేశారు. గతంలో జారీచేసిన జీవోల ప్రకారం వాల్యూ ఎడ్యుకేషన్తోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వ్యాయామ విద్యకు బడుల్లో పీరియడ్లను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.