చర్ల, సెప్టెంబర్ 16: ఏజెన్సీ గూడేలకు ప్రాథమిక వైద్యం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. నగరీకరణ, నాగరిక సమాజాలు విస్తరిస్తున్న వేళ ఆదివాసీ అతివలు అమ్మతనాన్ని ఆస్వాదించాలంటే.. అనంత కష్టాలు పడాల్సిందే. ముఖ్యంగా గిరిజన గర్భిణులు మరో బిడ్డకు జన్మనివ్వాలంటే.. ఒరుపైనా, వర్షమైనా జెట్టీల్లోనే దవాఖానకు చేరుకోవాలి.
పురిటినొప్పుల వేళ వారు ప్రాథమిక వైద్యం పొందాలన్నా కిలోమీటర్ల మేర నడవాల్సిందే. గర్భిణులను జెట్టీలో పడుకోబెట్టి భుజాలు మార్చుకుంటూ అక్కడి యువకులు పరుగులు పెట్టాల్సిందే. అందుకు సోమవారం ఇద్దరు గర్భిణులు అనుభవించిన పురిటినొప్పుల వేదన అద్దంపడుతున్నది. భద్రాద్రి జిల్లా ఏజెన్సీ మండలమైన చర్లలోని బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ సుబ్బమ్మ, రవ్వ దేవిలకు పురిటినొప్పులు ప్రారంభయ్యాయి. అందుబాటులో వైద్యశాల లేదు.
సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వారిని తరలించేందుకు ఆదివాసీ యువకులు అనేక పాట్లు పడ్డారు. ఇద్దరినీ వేర్వేరు జెట్టీలపై మోసుకుంటూ మూడు కిలోమీటర్ల మేర నడిచి వచ్చారు. అటవీ మార్గం ద్వారా ప్రయాణించి రోడ్డు పాయింట్ ఉన్న తిప్పాపురం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం భద్రాచలం ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు.