హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): యువత చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉన్నదని, వారే ఈ దేశాన్ని బాగు చేసుకోవాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశ నాయకులు మౌలికమైన సమస్యలను పక్కన పెట్టి జాతీయవాదం, ధర్మం, లింగం పేరిట ప్రభుత్వాలను నడుపుతున్నారని, దీంతో సంపన్నులు మరింత సంపన్నులవుతుండగా.. పేదలు మరింత పేదలుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఔరంగాబాద్లో సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. మహారాష్ట్ర పవిత్రభూమికి ప్రణామాలంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘ఒక ప్రశ్న దేశ మేధావులతోపాటు, నన్ను కూడా వేధిస్తున్నది. ఎంతో మహోన్నతమైన భారతదేశం లక్ష్యం ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?. దేశానికి ఒక లక్ష్యం ఉండాలా? వద్దా? ఒక లక్ష్యమంటూ లేకపోతే దేశ భవిష్యత్తు ఏమైపోతుంది. ఇది ఎవరి పాపం? ఏమైనా చేద్దామా? ఇలాగే వదిలేద్దామా? ఇది ప్రస్తుతం మనముందున్న సవాల్. ఇంతకుముందు నాందేడ్లో సభ పెట్టాం, కంధార్ లోహాలోనూ పెట్టాం. నేను చెప్పేది ఒక్కటే.. ఇక్కడే విని ఇక్కడే మరిచిపోవద్దు. మీ ఊరికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు, సహచరులు, బస్తీ వాళ్లతో, గ్రామస్తులతో చర్చించండి. అప్పుడు సత్యం ఏమిటో మీకే తెలుస్తుంది. మీకే అర్థం అవుతుంది.
లక్షలాది మంది యువత, నిరుద్యోగులు ఉపాధిలేక బజారున పడుతున్నారు. ఇలాగే ఉందామా? లేక మార్పు కావాల్నా? మౌలికమైన సమస్యలను పక్కన పెట్టి జాతీయవాదం, ధర్మం, లింగ వివక్షత పేరిట ప్రభుత్వం నడుస్తున్నది. సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నరు. ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలు.. 11 లక్షల మంది కోటీశ్వరులు అవుతున్నరు. పేదలేమో మరింత పేదలుగా మారుతున్నారు. ఇది మన కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది సత్యం. ఇలాగే కొనసాగాల్నా? దీనికేమైనా చికిత్స అవసరం ఉన్నదా? ఏ రోగమైనా నయం కావాలంటే చికిత్స తప్పదు కదా? దీనిపై మేధావి వర్గం, యువత ఆలోచించాలి. రోగాన్ని నయం చేయగలిగేది ఒక్క డాక్టరే. అలాగే సమాజాన్ని బాగు చేయగలిగేది యువతనే. ఈ దేశానికి చికిత్స అవసరమా? లేదా? ఒక్కసారి ఆలోచించండి. యువశక్తికి నేను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రేపటి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆ ఉజ్వల భవిష్యత్తు మీదే. దీని గురించి మీరే పక్కా ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఏ అమెరికానో, మరే దేశం నుంచో ఎవరూ రారు. మనముందున్న సవాల్ ఏమిటంటే ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. లేకపోతే ఎంత ఆలస్యం అయితే అంత అన్యాయం, మరింత నష్టం జరుగుతుంది.
ఒక విషయం ఆలోచించండి. హిందుస్థాన్లో ఎంతోమంది రైతు నాయకులు జన్మించారు. స్వాతంత్య్రానికి ముందే పంజాబ్లో చోటేరామ్, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి మహేందర్సింగ్ టికాయత్, మహారాష్ట్రలో శరద్జోషి, కర్ణాటకలో ప్రొఫెసర్ నంజుండ స్వామి, తమిళనాడులో నారాయణస్వామి, పంజాబ్లో రాజా వాల్జీ అలాగే వేదికపై కూర్చున్న భారత కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్.. వీరంతా రైతులతో కలిసి రైతాంగ సమస్యలపై ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నారు. రైతు వ్యతిరేక సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీలో ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత ప్రధాన మంత్రి మేల్కొని రైతులను క్షమాపణ కోరారు. చట్టాలను ఉపసంహరించుకున్నామని చెప్పారు. ఇంకో 13 నెలలు గడిచిపోయింది. ఇదా రాజనీతి? ఇంతమంది రైతులు బలికావాల్నా? దేశంలో ఏమి తమాషా జరుగుతున్నది? దీని మతలబు ఏమిటి? ఇందులో ‘కుచ్నా కుచ్ దాల్ మే కాలా హై’. ఇదే విషయాన్ని నేను ఒకచోట చెప్తే.. వారేమన్నారో తెలుసా? ‘దాల్ మే కాలా.. పురానా బాత్ హై భయ్యా, దాల్ మే కాలా నహీ.. దాల్ హీ కాలా హై’ అన్నారు. దీని మతలబ్ ఏంది? దీనికి తప్పనిసరిగా చికిత్స అవసరం.. కొంతైనా పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’ అన్నారు.