హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ఐదు అంతస్తులతో కొత్తగా నిర్మించిన ఆంకాలజీ బ్లాక్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ అత్యాధునిక బ్లాక్ను వారం పదిరోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్సార్ ఫండ్ కింద రూ.80 కోట్లతో ఈ బ్లాక్ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఈ బ్లాక్ ప్రారంభమైతే క్యాన్సర్ దవాఖానలో మరో 300 పడకలు అందుబాటులోకి వస్తాయని ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత వెల్లడించారు. దీంతో మొత్తం పడకల సంఖ్య 750కి పెరుగుతుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎంఎన్జేలో 250 పడకలు మాత్రమే ఉండేవి. రోజురోజుకు క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎంఎన్జే విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం మూడున్నర ఎకరాల స్థలం కేటాయించి, నూతన బ్లాక్ను నిర్మించింది. దవాఖానలో ప్రస్తుతం రోజూ 500 నుంచి 1,000 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. నిత్యం 600 వరకు ఇన్పేషెంట్ (ఐపీ) రోగులు దవాఖానలో చికిత్స పొందుతుంటారు. చిన్నపిల్లలు, పురుషులు, మహిళలకు ఒకే బ్లాక్లో ఉండటంతో పాత భవనం కొంత ఇరుకుగా ఉండేది. కొత్త బ్లాక్తో ఈ సమస్య తీరనున్నది.