హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో ఒక అరుదైన సం దర్భం ఏర్పడబోతున్నది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలాలు గురువారం ముగుస్తు న్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో చైర్మన్, వైస్చైర్మన్ పదవీకాలం ఒకేసారి ముగిసిపోయిన సందర్భాలు చాలా అరుదు. ఇటువంటి సమయంలో చైర్మన్ విధులను ఎవరు నిర్వహించాలి? మామూలు పరిస్థితుల్లోనైతే.. చైర్మన్ లేనప్పుడు వైస్చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇద్దరి పదవీకాలం ఒకేసారి ముగుస్తున్నప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై రాజ్యాంగం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. మండలి లేదా శాసనసభలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు సభానాయకుడు సీనియర్ సభ్యుడిని, లేదా చట్టం పట్ల అవగాహన ఉన్న సభ్యుడిని చైర్మన్ ప్రొటెమ్గా నియమిస్తారు. ప్రస్తుతం మండలిలోనూ అదే పద్ధతిని అనుసరించనున్నారు. వీరిద్దరి పదవీకాలంముగిసేలోగా (జూన్ 3) ఒక సీనియర్ సభ్యుడిని చైర్మన్ ప్రొటెమ్గా నియమించే అవకాశం ఉన్నది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఎంతమాత్రం ఉండదని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ప్రొటెమ్గా మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వీ భూపాల్రెడ్డి, నిజామాబాద్కు చెందిన డీ రాజేశ్వర్రావు, కరీంనగర్కు చెందిన నారదాసు లక్ష్మణ్రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
దేశంలో రాజ్యసభ, లోక్సభ, రాష్ర్టాల్లో శాసనమండలి, శాసనసభల్లో రెండు పదవులు ఒకేసారి ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. 1977లో ఫకృద్దీన్ అలీ అహమ్మద్ రాష్ట్రపతి పదవిలో మరణించారు. అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వీడీ జెట్టి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయినట్టయింది. అదే సమయంలో రాజ్యసభ వైస్ చైర్మన్గా ఉన్న గోడె మురహరి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పుడు బనారసీదాస్ రాజ్యసభకు చైర్మన్ ప్రొటెమ్గా నియమితులయ్యారు. 1981లో కర్ణాటక శాసనమండలిలో చైర్మన్, వైస్చైర్మన్గా కొనసాగుతున్న శంకర్మూర్తి పదవీకాలం ముగిసింది. అప్పు డు బసవరాజు అనే మండలి సభ్యుడిని చైర్మన్ ప్రొటెమ్గా అప్పటి ప్రభుత్వం నియమించింది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చైర్మన్ చక్రపాణి, వైస్ మహమ్మద్ జానీ పదవీకాలం ఏకకాలంలో ముగిసింది. చైర్మన్ ప్రొటెమ్గా బసవపున్నయ్య నియమితులయ్యారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పదవీ కాలం ఈ నెల 24తో ముగిసింది. అక్కడ డిప్యూటీ చైర్మన్గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ నెల 18తో ముగుస్తుంది. అంటే అక్కడ చైర్మన్ ప్రొటెమ్గా ఎవరినో ఒకరిని నియమించే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఏపీలో శాసనమండలికి ఇలా ఏకకాలంలో అటు చైర్మన్కు, ఇటు వైస్ చైర్మన్ పదవీ కాలం పూర్తి అయిన సందర్భాలు లేవు. శాసనసభకు మాత్రం 1981లో ఇటువంటి పరిస్థితే ఉత్పన్నమైంది. అప్పుడు ప్రభుత్వం మూర్తిరాజు అనే శాసనసభ్యుడిని ప్రొటెమ్ స్పీకర్గా నియమించింది. మూర్తి రాజు ఏడు నెలలపాటు ఆ పదవిలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో గౌతమ్ అనే ఎమ్యెల్యే పది నెలలు ప్రొటెమ్ స్పీకర్గా వ్యవహరించారు.
కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ చైర్మన్, స్పీకర్కు ఉండే అన్ని అధికారాలుంటాయి. ఎస్కార్ట్, ప్రొటోకాల్, జీతభత్యాలు, బంగ్లా సౌకర్యాలు, గౌరవాలుంటాయి.
జూన్ 3 తో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండు ఖాళీ అవుతున్న నేపథ్యం లో భారత రాజ్యాంగం ప్రకారం, తెలంగాణ శాసనసభ చట్టం ప్రకారం అనుసరించే అన్ని పద్ధతులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. నర్సింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి