పాలకుర్తి రూరల్, ఆగస్టు 16: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు స్థానికుల నుంచి స్పందన కరువైంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు శివారు నుంచి మంగళవారం యాత్ర కొనసాగించగా బండి సంజయ్ మాట్లాడిన ప్రసంగం అర్థంకాక బిత్తర చూపులు చూశారు. ఓ దశలో ఆయనే మధ్యమధ్యలో ‘చప్పట్లు కొట్టరా’ అని అడగడం కనిపించింది. పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభ స్థానిక ప్రజలు, నాయకులెవరూ లేక వెలెవెలబోయింది. బండి వెంట వచ్చిన బౌన్సర్లు, గూండాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తప్ప నియోజకవర్గం నుంచి, పాలకుర్తి మండలం నుంచి గాని ఎవరూ రాలేదు. కేవలం మండలంలోని ఓ పది, ఇరవైమంది కార్యకర్తలే యాత్రలో పాల్గొన్నారు. సభలో బండి సంజయ్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. సభకు రావాలని బీజేపీ శ్రేణులు కూలీ ఇచ్చి మహిళలను తీసుకొచ్చారు. మైనర్లను యాత్రకు తీసుకురావడం విమర్శలకు దారితీసింది.
జర్నలిస్టుల నిరసన
పాలకుర్తి సభలో బీజేపీ నాయకుడు వెంగళ్రావు డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహానికి లోనైన జర్నలిస్టులు సంజయ్ వాహనం ఎదుట నిరసనకు దిగారు. దీంతో అన్నా.. ‘నేనే సారీ చెప్తున్న’ అంటూ బండి జర్నలిస్టులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. సీపీని తిట్టేందుకే యాత్రనా?
వరంగల్ పోలీస్ కమిషనర్ను తిట్టేందుకే ఉమ్మడి జిల్లాలో ఎంపీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నాడా? అని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యా నించారు. నిన్న దేవరుప్పులలో సీపీని తిట్టిన బండి.. నేడు పాలకుర్తిలోనూ సీపీపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై చర్చించుకొంటున్నారు.
జనగామ బీజేపీలో ఫ్లెక్సీల రగడ
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సొంత పార్టీలోనే సెగలు రేపుతున్నది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జనగామ ఆర్టీసీ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, ఆ పార్టీ జిల్లా నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి వర్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో రగడ మొదలైంది. ఇద్దరు నేతలు జనగామ బీజేపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ ఆది నుంచీ ఉప్పు-నిప్పులా ఉన్నది. పోటాపోటీ మీటింగ్లు పెడుతూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ చౌరస్తాలో మొదట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి మూడు ఫ్లెక్సీలు కట్టించారు. ఆ తర్వాత వాటి మధ్యలో ఆ పార్టీ జిల్లా నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి ప్రత్యేకంగా రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇది గమనించిన దశమంతరెడ్డి సోదరుడు, మాజీ కౌన్సిలర్ లోకమంతరెడ్డి తమ అనుచరులు 30 మందిని తీసుకొచ్చి చౌరస్తా లో ఉన్న ముక్కెర తిరుపతిరెడ్డి సోదరుడు, బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి సర్పంచ్ ముక్కెర కరుణాకర్రెడ్డితో పాటు ఆ వర్గానికి చెందిన 30 మంది కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల కార్యకర్తలు గల్లాలు పట్టుకొని ఘర్షణకు దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జనగామ అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.