Ponnam Prabhakar | ఆటో కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డీజిల్,పెట్రోల్ ఆటోలను రేటిరోఫిట్మెంట్ చేసుకోవడానికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తున్నామని అన్నారు.
2012 తర్వాత ఆటో చార్జీలను పెంచలేదని తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించి బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి విధానంతో వారికి మరింత ప్రయోజనం కల్పించవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కరిస్తాం
ఆటో కార్మికుల సమ్మె పై వెనక్కి తీసుకోవాలి
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం
డీజిల్,పెట్రోల్ ఆటో లను రేటిరోఫిట్మెంట్ చేసుకోవడానికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తున్నాం!
2015 తర్వాత ఆటో… pic.twitter.com/1tU3genO7x
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 23, 2026
హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్మెంట్కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎలక్ట్రిక్ ఆటోలకు మారేందుకు ప్రతి ఆటోకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సహాయం చేసేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. హైదరాబాద్లో దశలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాల్లో అర్హులైన ఆటో కార్మికుల కుటుంబాలకు కూడా ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించిన విధంగానే ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
హైదరాబాద్లో లేకపోవడం వల్ల ఆటో కార్మిక సోదరులకు హుస్నాబాద్ నుండి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి సహకరించాని కోరారు.