హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/ వనపర్తి టౌన్/పరకాల: జీవో 97ను రద్దు చేయాలని శాంతియుతంగా ధర్నా చేసేందుకు వెళ్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం జరుగగా, తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం(నేడు) రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని, ఆస్తులు, విద్యార్థులను ప్రైవేట్ వ్యక్తుల అధీనంలోకి మార్చవద్దని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సోమవారం ఇందిరాపారులో ధర్నాకు పిలుపు ఇచ్చింది.
కాగా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను ఇందిరాపారు సిగ్నల్ వద్ద అరెస్టు చేసి దోమలగూడ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, కార్యదర్శి టీ నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పేరుతో పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ధర్నాచౌక్లో ధర్నాలు నిషేధించడం దుర్మార్గం అని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను హరించడమే అని మండిపడ్డారు.
రాహుల్గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ప్రజాస్వామ్య రక్షణకు సందేశాలు ఇస్తూ.. రాష్ట్రంలో మాత్రం వారి నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. జీవో 97 రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్లో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాకు దిగారు.
పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఏబీవీపీ నేతలు మాసాబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని నగర కార్యదర్శి పృథ్వీ వాపోయారు. జీవో 97ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.