దేవరుప్పుల, ఆగస్టు 20 : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేపట్టిన కాలువ బాట పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేక తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న రైతుల పక్షాన నిలిచిన బీఆర్ఎస్ పార్టీ దేవాదుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాలువ బాటకు పిలుపునివ్వగా వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లతో తరలివచ్చారు. దేవరుప్పుల మండలం ధరావత్ తండా నుంచి సింగరాజుపల్లి వరకు 6 కిలోమీటర్లు కాలువ వెంట పాదయాత్ర చేపట్టారు. కాలువ వెంట కిలోమీటర్ మేర పాదయాత్ర గులాబీమయం కాగా నీరిచ్చే వరకు పోరాటం తప్పదంటూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాలువ వెంట ఎండిన పంటలను పరిశీలిస్తూ రైతుల కష్టాలు తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు.
పాదయాత్ర సింగరాజుపల్లికి చేరుకోగా నీళ్లు ఎప్పుడు వదులుతారో తెలిపితేనే కదులుతామంటూ జాతీయ రహదారిపై ఎర్రబెల్లితోపాటు పార్టీ శ్రేణులు, వేలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించారు. సాగునీటి శాఖ అధికారులు సమాధానం చెప్పే వరకు లేచేది లేదని ఎర్రబెల్లి తెగేసి చెప్పారు. స్టేషన్ఘన్పూర్ నుంచి నీరు వదిలారని చెప్తున్న కాంగ్రెస్ నాయకులు ఏ చెరువు నిండిందో తెలుపాలని సవాల్ విసిరారు. చిత్తశుద్ధి ఉంటే దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని చెరువులు నింపి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం.. కూలేశ్వరం అంటూ మాటలతో కాలం వెళ్లదీస్తున్న రేవంత్రెడ్డి.. కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా నీరున్నా ఇచ్చే స్థితిలో లేరని మండిపడ్డారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి.. కరెంటివ్వాలి.. వడ్లు పండితే ప్రభుత్వం కొనాలి.. కొంటే సన్నబియ్యానికి బోనస్ చెల్లించాలి.. ఏకంగా నీరే ఇవ్వకపోతే మంచిదనే స్వభావంతో ఈ ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవా చేశారు.
ఎర్రబెల్లి మాట్లాడుతుండగా దేవరుప్పుల ఎస్సై సృజన్కుమార్ పోలీసు సిబ్బందితో వచ్చి ధర్నాను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఎర్రబెల్లిని లేపే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆరగంటపాటు ఎర్రబెల్లిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఎండ తీవ్రంగా ఉండటంతో ఎర్రబెల్లితోపాటు మండల నాయకుడు సుందర్రాంరెడ్డి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వచ్చింది. పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు పక్కకు తప్పుకోవడంతో పోలీసులు దయాకర్రావును అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో దేవరుప్పుల పోలీస్స్టేషన్కు తరలించి, కొద్దిసేపు ఉంచి వదిలిపెట్టారు. కాగా సింగరాజుపల్లి వద్ద జరిగిన తోపులాటలో ఎర్రబెల్లికి తలకు స్వల్పగాయం కాగా దేవరుప్పులలో ప్రాథమిక చికిత్స చేయించుకుని పాలకుర్తికి బయలు దేరారు.
పాదయాత్ర మధ్యలో ధరావత్ తండా వద్ద రైతు కున్సోత్ పుల్యా తన వ్యవసాయ క్షేత్రంలో బోరు వేయిస్తుండగా ఎర్రబెల్లి దయాకర్రావు అక్కడికి వెళ్లారు. తనకు నాలుగు ఎకరాలు ఉండగా ఇప్పటివరకు 16 బోర్లు వేసినట్టు రైతు పుల్యా తెలిపారు. ప్రస్తుతం వేస్తున్న బోరు నుంచి రాతి పొగ రావడంతో ఇది ఫెయిల్ అయిందని రైతు రోదించాడు. నీళ్లు లేక వరి, పత్తి పంటలు ఎండుతున్నాయని, కాలువ పక్కనే భూమి ఉన్నా, కాలువలు పారకపోవడంతో బోర్లు ఎండిపోయాయని పుల్యా ఆవేదన వ్యక్తం చేశాడు.