హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చేర్చడం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాలను ప్రాచుర్యంలోకి తెచ్చి, ఇక్కడి ప్రజలను జాగృతం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందని కొనియాడారు.
కవితకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్కు ఆ ప్రభుత్వ మంత్రులు, అధికారులు బాధ్యులవుతారు కానీ, తెలంగాణకు చెందిన కవితకు ఏం సంబంధమని కోలేటి ప్రశ్నించారు. కవితపై పెట్టే కేసు న్యాయస్థానాల్లో నిలువదని ఆయన విశ్వా సం వ్యక్తం చేశారు. కవితపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలకు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈడీతో బీజేపీ చేయిస్తున్న కుతంత్రాలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.