సీసీఎస్ పోలీసుల అదుపులో ప్రధాన సూత్రధారి?
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో తెలుగు అకాడమీ అధికారులు, సిబ్బంది పాత్రపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేశ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ను ఆదివారం సీసీఎస్లో విచారించారు. కీలకసూత్రధారులుగా భావిస్తున్న ముగ్గురు ఏజెంట్లలో రాజ్కుమార్ను సీసీఎస్ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లు సుమారు రూ.64 కోట్లు గోల్మాల్ వ్యవహారంలో ఉద్యోగుల్లో కొందరికి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు అకాడమీలోని సీసీ కెమెరాల పుటేజీలను విశ్లేషిస్తున్నారు. ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ సత్యనారాయణరావు, మేనేజర్లు పద్మావతి, మొహినుద్దీన్తోపాటు యూబీఐ బ్యాంకు కార్వాన్ బ్రాంచి మాజీ చీఫ్మేనేజర్ మస్తాన్వలీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్చేశారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సమయంలో రాజ్కుమార్ అనే పేరుతో ఉన్న వ్యక్తి దళారీగా వ్యవహరించినట్టు గుర్తించారు. రాజ్కుమార్ మూడు నాలుగు పేర్లతో చలామణి అయినట్టు దర్యాప్తులో తేలింది. అకాడమీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగి రఫీక్తో అతనికి సంబంధాలున్నట్టు ఆధారాలు సేకరించారు. డిపాజిట్లు మామయ్యాయనే విషయం అధికారులకు తెలియగానే.. కీలక సూత్రధారులుగా భావిస్తున్నవారు ఫోన్లు స్విచాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసులు సమాచారం.