హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆహ్వానం పలుకుతున్నది. జోన్ల వారీగా నిర్ధారిత రంగాలకు చెందిన పారిశ్రామికవాడల్లో పలు ఖాళీ ప్లాట్లు ఉన్నాయని, నిర్ణీత ధరతో వాటిని సొంతం చేసుకొని, పరిశ్రమను స్థాపించాలని సూచించింది. ఈ మేరకు ఖాళీ ప్లాట్ల వివరాలను వెల్లడించింది. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీఎస్ఐపాస్ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. టీఎస్ఐఐసీ ద్వారా ఇప్పటి వరకు 56 నూతన పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది.
ఇప్పటికే 19,961 ఎకరాలను అభివృద్ధి చేసి.. 2,980 పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసింది. మరో 15,620 ఎకరాల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఔత్సాహికులు ముందుకొస్తే, వారి ప్రాజెక్టు నివేదిక, ఆర్థిక ప్రొఫైల్ను పరిశీలించి ప్లాట్లు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. వివరాల కోసం ఆయా జోన్లలోని టీఎస్ఐఐసీ జోనల్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.