హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ లేదా ఉభయసభలు ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ర్టాల గవర్నర్లు నిర్ణీత గడువులోగా ఆమోదించేవిధంగా రాజ్యాంగ సవరణ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి సిఫారసు చేయాలని కోరుతూ లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్థికి బుధవారం ఆయన లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో పేర్కొన్న ‘యాజ్ సూన్ యాజ్ పాసిబుల్’ పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ, నెలల తరబడి బిల్లులను పెండింగ్లో ఉంచడం వల్ల్ల ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘యాజ్ సూన్ యాజ్ పాసిబుల్’ పదాన్ని మార్చేసి ‘విత్ ఇన్ 30 డేస్’గా చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్లు నిర్ణీత గడువులోగా ఆయా బిల్లులను ఆమోదించడం ద్వారానో, తిరస్కరించడం ద్వారానో క్లియర్ చేస్తే ఆయా రాష్ర్టాలు వాటిని రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు కొన్ని బిల్లులను క్లియర్ చేయకుండా, నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారని ఆక్షేపించారు.
‘యాజ్ సూన్ యాజ్ పాసిబుల్’ పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటారనే విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేకపోయి ఉండవచ్చునని వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ల పాత్రపై రాజ్యాంగ నిర్మాతలకు ఏమాత్రం అనుమానాలు వచ్చినా.. ఆర్టికల్ 200లో వేరే రకంగా రాసి ఉండేవారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తీర్పు వల్ల ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను.. రాజకీయంగా నామినేట్ అయన గవర్నర్లు ఇబ్బందుల పాలు చేస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ర్టాల్లో పరిపాలన, ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ తక్షణ అవసరమని నొక్కి చెప్పారు.
గవర్నర్ వ్యవస్థ వల్ల తెలంగాణతోపాటు తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లో పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినోద్కుమార్ గుర్తు చేశారు. ఆయా రాష్ర్టాల్లో శాసనసభలు ఆమోదించిన అనేక ముఖ్యమైన బిల్లులు గవర్నర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని చట్టసభలు ఆమోదించిన బిల్లులను నెలల కొద్దీ పెండింగ్లో పెట్టడాన్ని ప్రశ్నించారు. ఆర్టికల్ 200లో సవరణలు చేస్తే తప్ప ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వాలు సాఫీగా పరిపాలన చేసే పరిస్థితులు ఉండవని, గవర్నర్ల బాధ్యతలను, బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువును నిర్దేశించాల్సిన ఆవశ్యకత ఉన్నదని స్పష్టంచేశారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రమే గవర్నర్లు ఇకట్ల పాలు చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలకు గవర్నర్లు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,062 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, క్లియరెన్స్ కోసం గవర్నర్కు పంపగా.. నెలలు గడుస్తున్నా ఆ బిల్లు పెండింగ్లోనే ఉన్నదని వివరించారు. ఈ పోస్టుల భర్తీకి అనేకమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి అనేక బిల్లులు వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎనిమిది కీలక చట్టాలకు సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లులకు గత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ఆమోదం లభించింది. ప్రభుత్వం వీటిని గవర్నర్ తమిళిసై ఆమోదానికి పంపించింది. బిల్లులను ఉభయసభలు ఆమోదించి రెండు నెలలు గడుస్తున్నా గవర్నర్ ఇప్పటివరకూ ఆమోదం తెలుపలేదు.
తమిళనాడులో ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద 20 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం 2020లో పంపించిన బిల్లులకు కూడా ఇంతవరకూ ఆమోదముద్ర వేయలేదు. వాటిని తిరస్కరించనూలేదు. ఇలా ఏదీ చెప్పకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారు.