ఖైరతాబాద్, జూలై 21: ‘గతంలో ఈటల రాజేందర్ మాదిగలను చీల్చే కుట్రలు చేశారు. మాదిగ జాతి ఉద్యమం విజయవంతం కాకుండా అనేక ప్రయత్నాలు చేశారు. నేడు ఆ జాతికి ఆగర్భ శత్రువైన బీజేపీ పంచన చేరారు. హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తే ఈటలను ఓడగొట్టి తీరుతాం. ఆ పార్టీ నుంచి ఎవరు పోటీచేసినా వారిని ఇంటికి పంపిస్తాం’అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఖైరతాబాద్లోని అంబేద్కర్ స్ఫూర్తిభవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి తన శాఖ పరిధిలోకి వచ్చే మాదిగల సమస్యలను విస్మరించడం చాలా బాధాకరమన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.