Congress | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఖమ్మం సభ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సరికొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నది. ఇద్దరు నేతలు ఈ సభ ను తమ బలప్రదర్శనకు వేదికగా మా ర్చుకోవాలని చూస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్లో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎవరికి వారు ఇది తమ సభ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వేయి కిలోమీటర్ల పా దయాత్ర పూర్తయిన సందర్భంగా అభినందించడానికి రాహుల్గాంధీ వస్తున్నారని భట్టి వర్గం ప్రచారం చేసుకుంటున్న ది. పొంగులేటి వర్గం మాత్రం తమ నేత చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్కు సరికొత్త ఊపు, ఉత్సాహం వచ్చిందని, ఖమ్మం లో తమ నేత బలమేమిటో చెప్పడానికే సభ ఏర్పాటు చేయించారని ప్రచారం చేసుకుంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్లో ఇన్నాళ్లు భట్టి పెత్తనం కొనసాగగా.. పొంగులేటి చేరికతో ఇరువురి మధ్య ఆధిపత్య పోరు తప్పదని సభ ఏర్పాటులోనే స్పష్టమవుతున్నది.
రగిలిపోతున్న రేణుకా వర్గీయులు
పొంగులేటి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఫొటో కనిపించడంలేదు. దీంతో ఆమె అనుచరులు పొంగులేటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి ఎక్కడ ఉంటే అక్కడ గ్రూపులు ఉంటాయని, కాంగ్రెస్లో కూడా అదేవిధంగా చేస్తున్నారని, అందరినీ కలుపుకొని పోవడంలేదని, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరిస్తున్నారు.