వరంగల్ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్ స్కోర్ని 25 పర్సంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ శనివారం పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పీజీ మెడికల్ అర్హత స్కోర్ను 25 పర్సంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ఫలితంగా జనరల్ అభ్యర్థులు 25శాతం పర్సెంటైల్(201 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 15శాతం పర్సెంటైల్(186 మార్కులు), దివ్యాంగులకు 2శాతం పర్సెంటైల్(169 మార్కులు) సాధించిన అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు.
కటాఫ్ మార్కులు తగ్గించడం ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, అదే విధంగా యాజమాన్య కోటా సీట్లకు అక్టోబర్ 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ని పరిశీలించవచ్చని తెలిపారు.