హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): తమవద్దనున్న ధాన్యాన్ని ప్రభుత్వానికి ఊరికనే వెనక్కి ఇచ్చేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. నెలల తరబడి ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడినందుకు కస్టోడియన్ చార్జీల కింద క్వింటాలుకు రూ. 500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అసోసియేషన్ తరఫున ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు అందించారు. 2022-23 యాసంగి సీజన్కు సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించేందుకు పౌరసరఫరాలశాఖ టెండర్లు పిలిచింది. టెక్నికల్ బిడ్ను శనివారం ఓపెన్ చేయగా, సోమవారం ఫైనాన్షియల్ బిడ్ను ఓపెన్ చేయనుంది. ఎక్కువ ధరకు కోట్ చేసిన వారికి ధాన్యాన్ని అప్పగించనుంది. ఈ నేపథ్యంలో మిల్లర్లు కొత్త మెలిక పెట్టారు. ధాన్యాన్ని ఇన్ని రోజులపాటు కాపాడినందుకు తమకు కస్టోడియన్ చార్జీలు ఇవ్వాలని, అలా ఇస్తేనే టెండర్లలో అర్హత సాధించిన వారికి బియ్యం అప్పజెబుతామని, లేదంటే లేదని తెగేసి చెప్తున్నారు. యాసంగి ధాన్యం దాదాపు 10 నెలలుగా ఆయా మిల్లుల్లో నిల్వ ఉంది. ధాన్యాన్ని నిల్వ చేసినందుకు కిరాయితోపాటు లోడింగ్, అన్లోడింగ్ చార్జీలు ఇవ్వాలని కోరుతున్నారు. తరుగుతోపాటు అన్ని ఖర్చులు కలిపి క్వింటాలుకు రూ.500 కస్టోడియన్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనే డిమాండ్
గత ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడే కస్టోడియన్ చార్జీల అంశాన్ని మిల్లర్లు తెరపైకి తెచ్చారు. అప్పుడు క్వింటాలుకు రూ. 340 డిమాండ్ చేస్తే ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మిల్లర్లు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో టెండరు ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచింది. మూడు నెలలు గడిచిన నేపథ్యంలో కస్టోడియన్ చార్జీల కింద రూ.340కి బదులు రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఏడు కంపెనీలు.. 32 బిడ్లు
ధాన్యం టెండర్లకు సంబంధించి ఏడు కంపెనీలు టెండర్లు దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీలు 12 లాట్స్కు గానూ మొత్తం 32 బిడ్స్ దాఖలు చేసినట్టు సమాచారం. ఈ ఏడు కంపెనీల్లో ఐదు కంపెనీలు గత టెండర్లలో పాల్గొనగా రెండు కంపెనీలు మాత్రం కొత్తగా పాల్గొన్నట్టు తెలిసింది. టెండర్ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నది. టెండర్ తుదిదశ ప్రక్రియ సాగుతున్న సమయంలో మిల్లర్లను అనుమతించవద్దని ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులకు పౌరసరఫరాలశాఖ ఆదేశాలు జారీచేసింది.