చేర్యాల/కొమురవెల్లి, సెప్టెంబర్ 6: తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా అన్నారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునుడిని దర్శించుకొన్నారు. ఆర్యవైశ్య సత్రంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం మీడియాతో కోలేటి మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలని మల్లన్నను మొక్కుకొన్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోదావరి నీళ్లతో మల్లన్న పాదాలు కడుగుతానని చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. నాడు ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు ఎక్కడ చూసినా జలకళ సంతరించుకొని పచ్చటి పంట పొలాలే కనువిందు చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖకు రూ.375 కోట్లు కేటాయిస్తూ మొదటి జీవో ఇచ్చారని, ఆ తర్వాత మరో రూ.500 కోట్లు కేటాయించినట్టు దామోదర్గుప్తా వెల్లడించారు.