ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ ప్రజాప్రతినిధి లండన్ నుంచి లంకపల్లికి వచ్చింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీ చిలుకూరి శ్యామల కొన్ని రోజుల క్రితం తన సొంత పనుల నిమిత్తం లండన్ వెళ్లింది. ఈలోపు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, తనకు సమాచారం అందడంతో ఓటు వేసేందుకు తిరిగి వచ్చింది. ఖర్చుకు సైతం వెనుకంజ వేయకుండా నేరుగా రెండు రోజుల ముందుగా లండన్ నుంచి స్వగ్రామమైన లంకపల్లికి చేరుకుంది. శుక్రవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకుంది.