హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): చిన్నపిల్లల ప్రత్యేక దవాఖాన నిలోఫర్ చిట్టి గుండెలకు కొండంత భరోసా కల్పిస్తున్నది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో గత జనవరిలో ఇక్కడ చిన్నపిల్లల గుండె సమస్యలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. అంతకుముందు చిన్నారులకు సంబంధించి ఏవైనా గుండె సమస్యలు ఉంటే వారిని ఉస్మానియా లేదా నిమ్స్కు రిఫర్ చేసేవారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రలు ఉస్మానియా, నిమ్స్ వంటి దవాఖానల్లో సాధారణ ఓపీలో గంటల తరబడి నిరీక్షించేవారు. వైద్యుల కన్సల్టేషన్తో పాటు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షల కోసం కూడా నిరీక్షించాల్సి వచ్చేది. చిన్నారులను ఇటు నిలోఫర్కు అటు ఉస్మానియాకు తీసుకుని తిరిగేవారు. దీనిని గమనించిన హరీశ్రావు ఉస్మానియా వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న నిలోఫర్లో చిన్నారుల కోసం ఒక యూనిట్ను ప్రారంభించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సౌకర్యాలను వెంటనే మంజూరు చేశారు. దీంతో ఐదు నెలల క్రితం నిలోఫర్లో పీడియాట్రిక్ కార్డియాలజీ యూనిట్ పురుడుపోసుకున్నది.
గర్భిణులకు కూడా ఓపీ సేవలు
నిలోఫర్ దవాఖానకు గుండె సమస్యలతో ప్రతి రోజు 40 నుంచి 50 మంది చిన్నారులు ఓపీ సేవల కోసం వస్తున్నారు. వీరికి స్కానింగ్ వంటి పరీక్షలు నిర్వహించి గుండె సమస్యలను గుర్తిస్తున్నారు. చిన్నారులతో పాటు 10 నుంచి 20 మంది గర్భిణులు సైతం గుండె సంబంధిత సమస్యలతో ఓపీ సేవలు పొందుతున్నారు. గత ఐదు నెలలుగా సుమారు 6 వేల మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యల కోసం ఓపీ సేవలు, చికిత్స పొందినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
పైసా ఖర్చు లేకుండా ఖరీదైన చికిత్సలు
సాధారణంగా చిన్నపిల్లలకు గుండె సంబంధిత వైద్య పరీక్షలుగాని, చికిత్స గాని చాలా ఖరీదుతో కూడుకొని ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే ఏ చిన్న పరీక్ష అయినా వేలలోనే ఉంటుందని నిలోఫర్ వైద్యులు తెలిపారు. అంతేకాకుండా హార్ట్ఫెయిల్యూర్, హోల్ వంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు చికిత్స చేయాలంటే కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం నిలోఫర్ దవాఖానలో పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉన్న చిన్నారులు, పుట్టుకతోనే హార్ట్ పంపింగ్ సమస్యలు, హార్ట్ఫెయిల్యూర్ పిల్లలే అధికంగా వస్తున్నారని, వీరికి లక్షల ఖరీదు చేసే చికిత్సను పైసా ఖర్చులేకుండా అందిస్తున్నట్టు వైద్యాధికారులు వివరించారు.
ప్రతి నెల 5-10 ఆపరేషన్లు
నిలోఫర్లో ప్రతిరోజు 30 నుంచి 40 మంది చిన్నారులు గుండె సమస్యల కోసం ఓపీ సేవలు పొందుతున్నారని, అందులో ప్రతి నెలా 5 నుంచి 10 మందికి శస్త్రచికిత్స అవసరం పడుతుందని, వారిని ఉస్మానియా లేదా నిమ్స్కు రిఫర్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గుండెలో రంధ్రం ఉండటం, పంపింగ్ బలహీనంగా ఉండటం, హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడే చిన్నారులకు నిలోఫర్లోనే అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. రానున్న రోజుల్లో చిన్నారులకు సంబంధించిన కార్డియాలజీ ఓపీ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు.